kolkata: కోల్‌కతాలో మహిళా బాక్సర్‌పై దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్

  • ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘటన
  • బాక్సర్‌ను తిడుతూ బస్సెక్కిన వ్యక్తి
  • బస్సును చేజ్ చేసి నిలదీస్తే గొంతుపట్టుకుని బెదిరించిన వైనం

కోల్‌కతాకు చెందిన అంతర్జాతీయ మహిళా బాక్సర్ సుమన్ కుమారిపై దుండగులు దాడి చేశారు. దక్షిణ కోల్‌కతాలోని మోమిన్‌పూర్ ప్రాంతంలో ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగినట్టు బాక్సర్ తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. ఉదయం కార్యాలయానికి వెళ్తుండగా బస్సు ఎక్కేందుకు అకస్మాత్తుగా ఓ వ్యక్తి తన స్కూటీ ముందుకు వచ్చాడని, దీంతో తాను సడెన్ బ్రేక్ వేశానని పేర్కొంది. అతడు తనను తిడుతూ బస్సెక్కాడని తెలిపింది.

 తాను బస్సును వెంబడించి తర్వాతి స్టాప్‌లో అతడిని పట్టుకుని నిలదీశానని, తననెందుకు తిట్టావని ప్రశ్నించానని పేర్కొంది. దీంతో రెచ్చిపోయిన అతడు తనను తిడుతూ గొంతు పట్టుకున్నాడని, దీంతో దగ్గర్లో ఉన్న పోలీసును సాయం కోసం అర్థించినా అతడు ముందుకు రాలేదని తెలిపింది. అయినప్పటికీ తనకు కోల్‌కతా పోలీసులపై విశ్వాసం ఉందని, ఈ విషయంలో నిందితులపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. కుమారి ఫేస్‌బుక్ పోస్టుకు స్పందించిన పోలీసులు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఘటన జరిగిన గంటలోనే నిందితులను అరెస్ట్ చేశామని, వారిని శిక్షిస్తామంటూ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆమెకు తెలియజేశారు.

More Telugu News