Sri Lanka: శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో అనుకోని అతిథులు... తేనెటీగల దాడికి బెంబేలెత్తిన ఆటగాళ్లు!

  • మ్యాచ్ మధ్యలో మైదానంలోకి ప్రవేశించిన తేనెటీగలు
  • నేలపై పడుకున్న ఆటగాళ్లు, అంపైర్లు
  • గతంలోనూ లంక, సఫారీ మ్యాచ్ లో తేనెటీగలు!

వరల్డ్ కప్ లో ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టాస్ ఓడిన శ్రీలంక మొదట బ్యాటింగ్ చేస్తుండగా, మధ్యలో మైదానంలోకి ఊహించని అతిథులు ప్రవేశించడంతో పరిస్థితి మారిపోయింది. భారీ సంఖ్యలో తేనెటీగలు ఒక్కసారిగా మైదానంలోకి చొరబడ్డాయి. దాంతో హడలిపోయిన ఆటగాళ్లు ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే నేలపై పడుకుండిపోయారు. అంపైర్లు కూడా ఉన్నచోటే నేలకు అతుక్కుపోయారు. కాసేపటికి తేనెటీగలు మైదానాన్ని వీడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొన్నాళ్లక్రితం కూడా ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా తేనెటీగలు వచ్చాయి. ఇప్పుడు కూడా అవే జట్లు ఆడుతున్నప్పుడు రావడంతో వరల్డ్ కప్ నిర్వాహకులు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

More Telugu News