Telugudesam seniors: టీడీపీ అసంతృప్తులకు బుజ్జగింపులు...రంగంలోకి దిగిన పార్టీ సీనియర్లు

  • చంద్రబాబుతో సమావేశానికి హాజరు కానివారికి ఫోన్లు
  • కారణాలను తెలుసుకుని మంతనాలు
  • ఒకరిద్దరితో తప్ప మిగిలిన వారితో సమస్య లేదంటున్న నేతలు

తెలుగుదేశం పార్టీలోని పెద్దలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా అంటీముట్టనట్లు ఉండడమేకాక, నిన్న అమరావతిలో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరు కాని వారి మనసులో మాట తెలుసుకుని అనునయించే ప్రయత్నం మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుల పార్టీ ఫిరాయించడం, కొందరు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు ఇటీవల జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితమే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు సహచరులతో సమావేశమయ్యారు. ప్రజా వేదిక కూల్చివేత అనంతర పరిణామాలు, కృష్ణా కరకట్టపై ఉన్న తన నివాస భవనం విషయంలో అనుసరించాల్సిన వ్యూహం, టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షకు అధికార పార్టీ కమిటీలు వేయడం తదితర అంశాలపై వారితో చర్చించారు.

ఈ సమావేశానికి పలువురు పార్టీ నాయకులు, ముఖ్యంగా ఓ సామాజిక వర్గం నేతలు డుమ్మాకొట్టారు. దీంతో అసలు ఈ నేతల్లో అసంతృప్తికి కారణం ఏమిటి? ఎందుకు సమావేశానికి హాజరు కాలేదు? మనసులో వేరే అభిప్రాయం ఉందా? అన్న అంశాలు తెలుసుకునేందుకు వారికి ఫోన్లు చేసి మాట్లాడారు. అయితే ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పార్టీ పట్ల విధేయతతోనే ఉన్నారని, ఎటువంటి సమస్య లేదని పార్టీ పెద్దలు చెబుతున్నారు.

More Telugu News