Gulf: ప్రతీ రెండు రోజులకు ముగ్గురు.. గల్ఫ్‌లో ప్రాణాలు కోల్పోతున్న ఆంధ్రులు!

  • కడప, చిత్తూరు, గోదావరి జిల్లాల నుంచి వలసలు
  • ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల కారణంగా పోతున్న ప్రాణాలు
  • లోక్‌సభలో వెల్లడించిన ప్రభుత్వం

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆంధ్రుల్లో ప్రతీ రెండు రోజులకు ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అత్యధికులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుండగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లలో ఏకంగా 1,656 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందినట్టు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది.

లోక్‌సభలో మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. ఏపీలోని కడప, చిత్తూరు, గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు ఉన్నట్టు తెలిపారు. వీరిలో చాలామంది క్లీనింగ్ స్టాఫ్‌గా, ఇంటి పనివారుగా చేస్తున్నట్టు తెలిపారు.

సభలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. గత మూడేళ్లలో కువైట్‌లో అత్యధికంగా 488 మంది ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలో 478 మంది, యూఏఈలో 351 మంది, ఒమన్‌లో 153 మంది, ఖతర్‌లో 108 మంది, బెహ్రయిన్‌లో 78 మంది  ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News