Andhra Pradesh: ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఔదార్యం.. ప్రమాదంలో గాయపడిన బాధితురాలిని తన కారులో తీసుకువెళ్లమన్న మంత్రి!

  • కలెక్టర్ల సదస్సుకు హాజరైన అనిల్
  • మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం
  • కారులో తరలించేందుకు సిద్ధమైన అనిల్

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన పెద్దమనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళను తన కారులో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి అంబులెన్సు సమయానికి చేరుకోవడంతో బాధితురాలిని అందులో తరలించారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు మంత్రి వస్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అమరావతిలో భేటీకి మంత్రి అనిల్ ఈరోజు ఉదయాన్నే నెల్లూరు నుంచి బయలుదేరారు.

అయితే మేదర మెట్ల ప్రాంతానికి చేరుకోగానే, అక్కడ ప్రమాదం జరగడాన్ని మంత్రి గుర్తించారు. వెంటనే కారును అపి ఘటనాస్థలికి వెళ్లి బాధితులను పరామర్శించారు.‘అన్నా.. ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారు? 108 అంబులెన్సు రాలేదా? నా కారును తీసుకెళ్లండి’ అని అక్కడివారికి చెప్పారు. అంతలోనే అక్కడికి 108 అంబులెన్సు చేరుకుంది. దీంతో స్థానికులతో కలిసి క్షతగాత్రులను 108 వాహనంలో తరలించారు. కాగా, అనిల్ స్పందించిన తీరుపై స్థానికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News