Undavalli: కాసేపట్లో ఏపీ కలెక్టర్ల సదస్సు...నవరత్నాలే ఎజెండాగా సీఎం జగన్ సమీక్ష

  • ఉండవల్లి ప్రజావేదికలో 10 గంటలకు సమావేశం ప్రారంభం
  • పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం
  • రెండు రోజులపాటు కొనసాగనున్న సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి భేటీ అవుతున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఈ సమావేశాలు రెండురోజులపాటు కొనసాగనున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నవరత్నాల అమలు ఎజెండాగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలిరోజు ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పాఠశాల విద్య, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ, పౌరసరఫరాల డోర్‌ డెలివరీ, కరువు పరిస్థితులు, వ్యవసాయం, పశుపోషణ,  గ్రామ వలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, విద్యుత్‌, మంచినీరు, నిరుపేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాల్లో ప్రాధాన్యత అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు.ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి వివరాలు రాబట్టనున్నారు. త్వరలో బడ్జెట్‌ సమావేశం జరగనుండడంతో ఈ సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని అధికారుల నుంచి సేకరించి అందుకు అనుగుణంగా జిల్లాలకు నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉంది. 

More Telugu News