Chandrababu: గంటాను కూడా బీజేపీలోకి పంపుతారు: చంద్రబాబుపై అవంతి సంచలన కామెంట్

  • ఈ విషయంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
  • ఐదేళ్ల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వలసలు
  • అమిత్ షా మాటలు నిజమవుతున్నాయి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు. అందుకే టీడీపీ నేతలను బీజేపీలోకి పంపుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీలోకి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయని, బీజేపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

More Telugu News