Gujarath: కుటుంబాన్ని హత్యచేసి, కారణాన్ని గోడమీద రాసి వెళ్లిపోయిన హంతకుడు

  • అప్పుతీర్చలేదని ఓ నిందితుడి ఘాతుకం
  • దంపతులు, ఇద్దరు పిల్లల గొంతుకోసి దారుణం
  • గుజరాత్‌లోని బనస్కంతా జిల్లాలో ఘటన

మానవత్వం ఏ కోశానా లేని ఓ వ్యక్తి దిగ్భ్రాంతి కలిగించేలా నలుగురిని హత్యచేసి అందుకు కారణాన్ని వారింటి గోడపైనే రాసి వెళ్లిపోయిన ఘటన ఇది. చేసిన అప్పు తీర్చలేదన్న కారణంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. గుజరాత్‌ రాష్ట్రం బనస్కంతా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... బనస్కంతా జిల్లా కుడా గ్రామానికి చెందిన ఉనాభాయి పటేల్‌ కొంత కాలం క్రితం ఓ వ్యక్తి వద్ద 21 లక్షల రూపాయల అప్పు చేశాడు.  అనుకున్న మేరకు అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన రుణ దాత నిన్నరాత్రి ఉనాభాయి ఇంటికి పదునైన ఆయుధంతో వచ్చాడు. ఇంట్లో ఉన్న ఉనాభాయి, అతని భార్య, కుమార్తె, కొడుకు గొంతుకోసి చంపేశాడు. అనంతరం హత్యలకు కారణాన్ని గోడపై రాసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు ఉదయం రక్తపు మడుగులో పడివున్న వారిని ఉనాభాయి కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News