Police: ప్రేమలో ఉన్నవేళ సన్నిహిత చిత్రాలు... అమ్మాయి పెళ్లయ్యాక భర్తకు ఫొటోలు!

  • తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఘటన
  • ప్రేమించానంటూ దగ్గరైన యువకుడు
  • ఆపై పెళ్లికి నిరాకరణ
  • పోలీసుల అదుపులో నిందితుడు

తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో వివాహం కాగా, తను దూరమైందన్న ఆగ్రహం ఓ యువకుడిని ఉన్మాదిగా మార్చింది. తామిద్దరి ఫొటోలను ఆమె భర్తకు పంపి వారి కాపురంలో చిచ్చుపెట్టాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కీల్ పెన్నాతూర్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గ్రామంలో వీరమణి అనే యువకుడు పాత్రలు విక్రయించే వ్యాపారి కుమారుడు. అదే షాపుకు ఓ పని నిమిత్తం వెళ్లిన 20 సంవత్సరాల యువతితో వీరమణికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వీరమణి, శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ క్రమంలో వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు తీసుకున్నారు.

తనను వివాహం చేసుకోవాలని అమ్మాయి కోరగా కొంతకాలం దాటవేస్తూ వచ్చి, ఆపై నిరాకరించాడు. దీంతో ఆమె చేసేదేమీ లేక పెద్దలు నిశ్చయించిన మరో యువకుడిని ఈ నెల 6న వివాహం చేసుకుంది. వివాహం తరువాత వీరమణిని కలిసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె భర్త సెల్ ఫోన్ నంబర్ ను సేకరించిన వీరమణి, తామిద్దరమూ దిగిన చిత్రాలను పంపించాడు. వేరొకరికి దగ్గరైన యువతిని తనకిచ్చి పెళ్లి చేశారన్న ఆగ్రహంతో, ఆ యువతితో కాపురం చేసేది లేదని కొత్త పెళ్లి కొడుకు తెగేసి చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించగా, వీరమణిని అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News