Cricket: ఊహించలేని స్కోర్.. టీ-20లో 314 పరుగులు పిండుకున్న అమ్మాయిలు!

  • రువాండాలో మహిళా టీ-20
  • ఫోర్ల వర్షం కురిపించిన ప్లేయర్స్
  • క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు

50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లోనే 300 పరుగులకు పైగా ఏ జట్టయినా సాధిస్తే బాప్ రే భారీ స్కోరని భావిస్తాం. అదే స్కోర్ ను టీ-20లో... అది ఊహించను కూడా ఊహించలేం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందో జట్టు. పొట్టి ఫార్మాట్‌ క్రికెట్ లో సరికొత్త రికార్డును నమోదు చేస్తూ, ఓ మహిళా జట్టు 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగుల స్కోరు చేసింది. మ్యాచ్ ఆసాంతం స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఇంత స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క సిక్స్ ఉండడం గమనార్హం.

రువాండాలోని కిగలి పట్టణంలో జరుగుతున్న క్విబుక విమెన్స్ టీ-20 టోర్నమెంట్ లో ఈ రికార్డు నమోదైంది. అంతర్జాతీయ పురుషుల, మహిళా టీ-20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్ ఉగాండా, మాలి జట్ల మధ్య జరుగగా, అలకో 71 బంతుల్లో 116 పరుగులు, ముసమాలి 61 బంతుల్లో 103 పరుగులు చేశారు. దీంతో ఉగాండా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 314 పరుగులు చేసింది. ఇక అంత స్కోర్ ను సాధించడంలో విఫలమైన మాలి జట్టు, 11.1 ఓవర్లలో ఆలౌటైంది.

More Telugu News