Andhra Pradesh: వ్యవసాయ పైపులు దొంగలించారట.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు!

  • పోలీసులకు రైతు సత్యనారాయణ ఫిర్యాదు
  • తాము చందాలు వేసుకుని పైపులు తెచ్చామని వ్యాఖ్య
  • కానీ చింతమనేని అర్ధరాత్రి తీసుకెళ్లిపోయారని ఆరోపణ

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు అయింది. పోలవరం కుడికాలువపై జానంపేట వద్ద నీటిని పొలాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన పైపులను చింతమనేని అర్ధరాత్రి తొలగించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై సత్యనారాయణ అనే రైతు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సత్యనారాయణ మాట్లాడుతూ.. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామాల రైతులంతా కలిసి తలా రూ.1,000 చందా వేసుకుని ఈ పైపులను అమర్చామని తెలిపారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానన్న అక్కసుతో చింతమనేని ఈ పైపులను రాత్రికిరాత్రి తొలగించి తన ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. రెండేళ్ల క్రితం చందాలు వేసుకుని ఈ పైప్ లైన్లను ఏర్పాటు చేసుకున్నామని వాపోయారు. ఈ ఘటనలో చింతమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రైతుల ఫిర్యాదు నేపథ్యంలో చింతమనేనిపై సెక్షన్ 420, 384, 431 రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్ పై ఏకంగా 17,459 ఓట్లతో ఘనవిజయం సాధించారు.

More Telugu News