Komatireddy Rajagopal Reddy: రెడ్లపై కన్నేసిన బీజేపీ... కాంగ్రెస్ ఇక లేనట్టే... మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

  • నిన్న రాత్రంతా అనుచరులతో చర్చలు
  • పార్టీ మారే విషయంలో అభిప్రాయాలు కోరిన రాజగోపాల్
  • బీజేపీలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయం

తెలంగాణ రాష్ట్రంలోని రెడ్డి వర్గం నేతలపై బీజేపీ కన్నేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రంతా పార్టీ మారే విషయమై తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన, బీజేపీలో చేరితే కలిగే లాభాలను గురించి వివరించి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు.

అతి త్వరలోనే బీజేపీలో పెద్దఎత్తున చేరికలు చూడబోతున్నామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని, ఆ దిశగా స్థానిక నేతలకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం పూర్తి సహాయ, సహకారాలను అందించనుందని చెప్పిన ఆయన, ముందుగానే బీజేపీలోకి చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డట్టు ఆయన అనుచరులు అంటున్నారు. పార్టీ మారినా తన ఎమ్మెల్యే పదవికి ఎలాంటి ఢోకా ఉండదని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

More Telugu News