Malaysia: మలేసియాలో నిజామాబాద్ వ్యక్తి దుర్మరణం

  • భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు
  • నాలుగో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు వదిలిన వైనం
  • స్పందించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

ఉపాధి కోసం మలేసియా వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. నిజామాబాద్ కు చెందిన షేక్ అహ్మద్ (37) మలేసియాలో పనిచేస్తుండగా, నాలుగో అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు వదిలాడు. ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేసేందుకు అహ్మద్ కొంతకాలం కిందట మలేసియా వెళ్లాడు. అయితే సోమవారం ఓ భవనంలో పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి మృతి చెందాడని అతని బంధువులు చెబుతున్నారు.

నిజామాబాద్ లో ఉన్నప్పుడు అహ్మద్ ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకునేవాడని, అధిక సంపాదన కోసం మలేసియా వెళ్లాడని తెలిపారు. మలేసియాలో ఉద్యోగం కోసం ఏజెంట్లకు చెల్లించడానికి అహ్మద్ లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని బంధువులు వెల్లడించారు. కాగా, అహ్మద్ మృతదేహాన్ని బుధవారం భారత్ కు తరలిస్తామని మలేసియాలోని భారత హైకమిషన్ అధికారులు తెలిపారు.

More Telugu News