Anantapur District: దాడులకు పాల్పడుతున్నారంటూ అనంతపురం వైసీపీ నేతలపై టీడీపీ ఫిర్యాదు

  • అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
  • ఎస్పీని కలిసిన పార్ధసారథి, పరిటాల, కాలువ
  • వైసీపీ నాయకులు గ్రామాల్లో రెచ్చగొడుతున్నారు

అనంతపురం జిల్లాలో తమ పార్టీ నాయకులపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్ధసారథితో కలిసి మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబును కలిశారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ అనంతరం తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం, మీడియాతో కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు గ్రామాల్లో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిటాల సునీత మాట్లాడుతూ, తన భర్త పరిటాల రవీంద్ర ట్రస్టు నిర్మించిన వాటర్ ప్లాంట్లను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడంపై ఆమె మండిపడ్డారు.

More Telugu News