Nigeria: ఫుట్ బాల్ అభిమానుల గుంపులో చేరి తమను తాము పేల్చుకున్న ఉగ్రవాదులు... 30 మంది మృతి

  • నైజీరియాలో ఉగ్రవాదుల మారణహోమం
  • బోకోహరాం దుశ్చర్యేనంటున్న అధికారులు
  • మరో 40 మందికి గాయాలు

నైజీరియాలో మరోసారి నరమేధం జరిగింది. ప్రమాదకర బోకోహరాం ఉగ్రవాదులు ఓ ఫుట్ బాల్ మ్యాచ్ ను వీక్షిస్తున్న క్రీడాభిమానులపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దాడి జరిగింది.

కొండుగ అనే ప్రాంతంలో కొందరు ఫుట్ బాల్ అభిమానులు వీడియో థియేటర్ లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా, ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్ తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్ ను వీక్షిస్తున్న ప్రజల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట 9 మంది ఘటనస్థలంలోనే ప్రాణాలు విడువగా, అంబులెన్స్ లు రావడం ఆలస్యం కావడంతో మరో 21 మంది తుదిశ్వాస విడిచారు. ఇది బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం పేర్కొంది.

More Telugu News