Chandrababu: పార్టీ అధినేత మనుషుల కన్నా మెషీన్లను ఎక్కువగా నమ్మారు: సుజనా వ్యాఖ్యలు

  • చంద్రబాబు కొన్నిచోట్ల మొహమాటానికి పోయారు
  • పాలనపై అధికశ్రద్ధ చూపి పార్టీని నిర్లక్ష్యం చేశారు
  • టీడీపీ ఓటమికి అందరూ కారకులే!

టీడీపీలో ఎంతోకాలంగా ముఖ్యనేతగా కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ఎన్నికల్లో ఓటమికి కారణం అయ్యుండొచ్చని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు అంచనాలు తప్పాయని తెలిపారు. 2014 వరకు చంద్రబాబు సన్నిహితవర్గంలో తాను కూడా ఉండేవాడ్నని, కారణాలేవైనా కానీ ఆ తర్వాత ఐదేళ్లకాలంలో ఆ సాన్నిహిత్యం సన్నగిల్లిందని చెప్పారు.

ఇవాళ పార్టీ ఓటమికి చంద్రబాబు బాధ్యత వహిస్తున్నా, అందులో అందరి పాత్ర ఉంటుందని వివరించారు. కొందరు అభ్యర్థులను తొలగించాల్సిన చోట చంద్రబాబు మొహమాటానికి పోయారని, మనుషుల్ని నమ్ముకోకుండా, టెక్నాలజీని, మెషీన్లను నమ్ముకున్నారని సుజనా తెలిపారు. అయితే, ఓ సంస్థలో ఓటమికి ఓ వ్యక్తి ఎప్పుడూ కారణం కాదని, అందరూ భాగస్వాములేనని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో పాలనపై అధిక దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీని అశ్రద్ధ చేశారని సుజన వెల్లడించారు.

More Telugu News