jarkhand: గుడిలో మద్యం తాగేందుకు వచ్చిన ఆకతాయిలు.. వద్దని చెప్పినందుకు పూజారి హత్య!

  • జార్ఖండ్ లోని విష్ణుపురా ప్రాంతంలో ఘటన
  • పూజారిగా పనిచేస్తున్న సుందర్ భుయా
  • కత్తితో పొడిచి పొదళ్లలో పడవేత

మంచిమాట చెప్పడమే మహా పాపం అయిపోయింది. భగవంతుడి సన్నిధిలో మద్యం సేవించవద్దని వారించిన పూజారిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పారిపోయారు. జార్ఖండ్ రాష్ట్రంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి విష్ణుపురా ప్రాంతంలోని ఓ గ్రామంలో సుందర్ భుయా(55) పూజారిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆలయం వద్దకు మద్యం, మాంసంతో విందు చేసుకునేందుకు వచ్చారు.

ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి వద్దని, అటుగా అటవీప్రాంతానికి వెళ్లాలని సుందర్ భుయా కోరారు. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. పదునైన కత్తితో ఆయన కడుపులో పొడిచారు. అనంతరం భుయాను సమీపంలోని పొదళ్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటిరోజు ఆలయానికి వచ్చిన భక్తులు పూజారి రోదన విని పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు.

అక్కడకు చేరుకున్న పోలీసులు భుయాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చనిపోయేముందు భుయా ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు.

More Telugu News