Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎందుకు ఓడిపోయిందో పవన్ కల్యాణ్ కు తెలుసు!: శెట్టిబత్తుల రాజబాబు

  • కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు
  • సొంత ప్రయోజనాలను చూసుకున్నారు
  • అమలాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థి వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన విజయం కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని అమలాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థి శెట్టిబత్తుల రాజబాబు తెలిపారు. కానీ కొందరు నేతలు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కారణంగా కొన్నిచోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జనసైనికులు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజబాబు మాట్లాడారు. 2024 ఎన్నికల నాటికి వీరిని పార్టీ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వీరిని బయటకు పంపి పార్టీని పటిష్టం చేసుకుంటామన్నారు. జనసేన ఘోర ఓటమికి కారణాలేంటో పవన్ కల్యాణ్ కు మొత్తం తెలుసని చెప్పారు. అమలాపురంలో తాను ఎంత కష్టపడ్డానో పవన్ ముందు రిపోర్టు ఉంటుందని అన్నారు. సోషల్ మీడియాను తాను ఫాలో కావడం లేదని తెలిపారు. అమలాపురం అసెంబ్లీ సీటు నుంచి వైసీపీ అభ్యర్థి పి.విశ్వరూప్ విజయం సాధించగా, రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు నిలిచారు.

More Telugu News