Andhra Pradesh: వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఏ ప్రాజెక్టునూ మేం అడ్డుకోలేదు.. గుర్తుపెట్టుకోండి!: అచ్చెన్నాయుడు

  • రుణమాఫీని అమలు చేశాం.. రూ.15 వేలకోట్లు చెల్లించాం
  • మిగతా బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించాలి
  • అసెంబ్లీ మీడియా పాయింట్ లో అచ్చెన్నాయుడు వ్యాఖ్య

టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీని అమలు చేసిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తామేదో ఎన్నికల హామీ ఇచ్చి తప్పించుకోలేదని వ్యాఖ్యానించారు. మొత్తం ఐదు విడతలుగా రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించామనీ, అందులో భాగంగా మూడు విడతల్లో రూ.15,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేశామని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు మిగతా టీడీపీ నేతలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు.

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద పలు కీలక ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజశేఖరరెడ్డి చేపట్టిన ఏ ప్రాజెక్టునూ ఆపలేదని గుర్తుచేశారు. ‘అభివృద్ధి అన్నది నిరంతరంగా సాగే ప్రక్రియ. గత ప్రభుత్వాలు చేశాయి కాబట్టి మేం అపేస్తాం అంటే ప్రజలే నష్టపోతారు’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అదనంగా ఏం చేసినా స్వాగతిస్తామనీ, ప్రస్తుతం మిగతా రెండు విడతల రుణాలను మాఫీ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

More Telugu News