Andhra Pradesh: వినుకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న స్కార్పియో వాహనం.. ముగ్గురి దుర్మరణం

  • అదుపుతప్పి చింతచెట్టును ఢీకొన్న వాహనం
  • వైజాగ్ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఘటన
  •  మృతులు విశాఖ జిల్లా వాసులుగా గుర్తింపు

గుంటూరు జిల్లా వినుకొండ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను విశాఖపట్టణం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన ప్రవీణ్‌కుమార్, రామకృష్ణ, వెంకటేశ్‌, కుమారస్వామి స్కార్పియో వాహనంలో మార్కాపురం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనం వినుకొండ మండలం విటంరాజుపల్లె వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చింతచెట్టును బలంగా ఢీకొట్టింది.  

ప్రమాదం ధాటికి వాహనం నుజ్జునుజ్జు అయింది. వాహనంలోని ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, వెంకటేశ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన కుమారస్వామిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News