Andhra Pradesh: మేం చంద్రబాబు బంట్రోతులం అయితే.. మీ 150 మంది జగన్ బంట్రోతులని ఒప్పుకోండి!: అచ్చెన్నాయుడు కౌంటర్

  • అచ్చెన్నాయుడిని బంట్రోతు అన్న చెవిరెడ్డి
  • ఘాటుగా స్పందించిన టీడీపీ నేత
  • బంట్రోతులమా లేక ఎమ్మెల్యేలమో తేల్చాలని డిమాండ్

తనను చంద్రబాబు బంట్రోతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభివర్ణించడంపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ ను తాను గౌరవంగా కుర్చీవరకూ వచ్చి కూర్చోబెట్టానని గుర్తుచేశారు. ఈరోజు చెవిరెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాట్లాడుతూ..‘అధ్యక్షా.. చంద్రబాబు తన బంట్రోతును పంపారు అన్న మాట మీకు తీపిగా ఉంటే దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.

మేము ఎమ్మెల్యేలమా? లేక బంట్రోతులమా? అన్నది మీరే తేల్చాలి. ఓకే... మేము చంద్రబాబు బంట్రోతులం అయితే మీరు 150 మంది జగన్ మోహన్ రెడ్డి బంట్రోతులు అని ఒప్పుకోండి. శాసనసభ్యులం కాదని ఒప్పుకోండి. మీకు దండం పెడతాం. మేం శాసనసభ్యులుగా, ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా సభకు వచ్చాం. తోటి శాసన సభ్యుడికి మరో శాసన సభ్యుడు గౌరవం ఇవ్వాలి’ అని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

More Telugu News