Nellore: ఈ నెల్లూరు లేడీ నిజంగా కిలేడీయే!

  • పెళ్లి పేరిట అబ్బాయిలను మోసం చేసే అర్చన
  • బంగారం, నిశ్చితార్థం, చీరల పేరిట లక్షల వసూలు
  • గతంలో అరెస్టయి బెయిల్ పై వచ్చినా మారని అర్చన
  • మరోసారి కటకటాల వెనక్కి

అందమైన తెలుగు యువతులను వివాహం చేసుకోవాలని భావించే విదేశీ యువకులే ఆమె టార్గెట్. నెల్లూరుకు చెందిన ఈ యువతి, ఎంబీయే చదివి, తన తెలివితేటలతో, అబ్బాయిలను సులువుగా బుట్టలో వేసుకుని లక్షలు లాగేస్తుంది. తమకు అందిన పలు ఫిర్యాదులతో ఈ కిలాడీపై నిఘా పెట్టిన నెల్లూరు పోలీసులు నిన్న ఆమెను అరెస్ట్ చేశారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీ నుంచి ఎంబీయే చదివిన అర్చన, నెల్లూరులోని  ఓ కాలేజీలో లెక్చరర్‌ గా పనిచేస్తున్న దుర్గా ప్రవీణ్‌ అనే యువకుడిని 2015లో పెళ్లి చేసుకుంది. ఆర్థికంగా అంత సానుకూల పరిస్థితి లేదని భావించిన ఆమె, మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌ లను వేదికగా చేసుకుని మోసాలకు తెరలేపింది. గూగుల్‌ నుంచి అందమైన అమ్మాయిల ఫొటోలను డౌన్ లోడ్ చేసుకుని, వాటితో ప్రొఫైల్స్ సృష్టించేది. తాను కేవలం విదేశీ అబ్బాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటానన్న అప్షన్‌ ఇచ్చేది.

ఆపై తాను పెట్టిన ఫొటో నచ్చి ఎవరైనా సంప్రదిస్తే, అసలు నాటకానికి తెరలేపేది. మొబైల్ యాప్ లను వాడుతూ, వివిధ రకాల వాయిస్ లతో వరుడి తల్లిదండ్రులతో అర్చన మాట్లాడేది. వారిని నమ్మించేది. వారు నమ్మారని తెలుసుకున్న తరువాత, పెళ్లికి తాను సిద్ధమంటూ, వరుడికి ఫొటోలు పంపించేది. ఆపై ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌లు, బంగారం, ఆభరణాలు, చీరలు కావాలంటూ డబ్బులు దండుకునేది.

ఈ క్రమంలో యూఎస్ లో పని చేస్తున్న తన కుమారుడి నుంచి వివిధ ఖాతాల్లో డబ్బు వేయించుకుందని ఓ ఐటీ ఇంజనీర్ తండ్రి సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సాంకేతికత సాయంతో అర్చనను అరెస్ట్ చేశారు. ఇదే తరహా కేసులో ఆమె గత సంవత్సరం డిసెంబర్ లో అరెస్ట్ కాగా, బెయిల్ పై బయటకు వచ్చిందని, ఆమెను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టి, చర్లపల్లి జైలుకు తరలించామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News