Andhra Pradesh: ఏపీలో టీడీపీ ఓటమితో చాలా సంతోషంగా ఉన్నా.. ఐదేళ్లలో రైతులు అల్లాడిపోయారు!: లక్ష్మీపార్వతి

  • రాజన్న రాజ్యం కోసం ఐదేళ్లు కష్టపడ్డాం
  • జగన్ సామాన్యులకు లబ్ధికలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు
  • ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓటమితో తాను చాలా సంతోషంగా ఉన్నానని వైసీపీ నేత, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. ఏపీలో రాజన్న రాజ్యం కోసం, సుపరిపాలన కోసం ఐదేళ్లు కష్టపడ్డామని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని విమర్శించారు. ముఖ్యంగా రైతులు అల్లాడిపోయారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చావేదికలో లక్ష్మీపార్వతి మాట్లాడారు.

చంద్రబాబు తన ఐదేళ్ల పదవీకాలంలో అబద్ధాలతో కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి వారం రోజులు కాకపోయినా ఆశావర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సహా సామాన్యులకు లబ్ధి కలిగేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం తెస్తామన్న జగన్ తన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రామ సెక్రటేరియట్ల ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

More Telugu News