TV9: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ రేపటికి వాయిదా

  • హైకోర్టులో ఇవాళ రవిప్రకాశ్ బెయిల్ పై విచారణ
  • వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది
  • రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యే అవకాశం!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఇవాళ హైకోర్టులో ఈ కేసు విచారణలో భాగంగా రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పై వాదనలు కొనసాగాయి. దీనిపై హైకోర్టు విచారణను రేపటికి వాయిదావేసింది.

ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, రవిప్రకాశే నటుడు శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు దాఖలు చేయించాడని ఆరోపించారు. రవిప్రకాశ్ నుంచి శివాజీ ఎలాంటి షేర్లను కొనుగోలు చేయలేదని కూడా స్పష్టం చేశారు. 40,000 షేర్లను రూ.20 లక్షలకు విక్రయించి ఉంటే ఆ లావాదేవీల వివరాలను ఐటీ విభాగానికి ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు.

ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

More Telugu News