Puri Jagannadh: పూరీ జగన్నాథ్ కు బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్!

  • మురళీ కృష్ణ అనే వ్యక్తి వద్ద 'ఇస్మార్ట్ శంకర్' స్క్రిప్ట్
  • డబ్బివ్వకుంటే ఆన్ లైన్లో పెడతానని బెదిరింపులు
  • గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన పోలీసులు

తాను నిర్మిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంపై మురళీ కృష్ణ అనే వ్యక్తి బెదిరింపులకు దిగాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రామ్ హీరోగా ఈ సినిమాను పూరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాను అడిగినంత డబ్బు ఇవ్వకుంటే, ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెడతానని మురళీ కృష్ణ డిమాండ్ చేయడంతో, పూరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవైపు నిర్మాతలు పైరసీతో సతమతమవుతున్న వేళ, ఇటీవలి కాలంలో స్క్రిప్ట్ లు సామాజిక మాధ్యమాల్లో పెడతామని వస్తున్న బెదిరింపులు పెరిగిపోతున్నాయని నిర్మాతలు, దర్శకులు వాపోతున్నారు.

కాగా, పూరీ ఫిర్యాదుపై అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ విభాగం, సదరు వ్యక్తిని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి విచారించినట్టు తెలుస్తోంది. తాను కూడా మరో వెబ్ సైట్ నుంచి స్క్రిప్ట్ ను పొందానని, తానేమీ డబ్బు డిమాండ్ చేయలేదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News