Nadendla Manohar: జనసేనను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై నాదెండ్ల మనోహర్ వివరణ

  • నాదెండ్ల పార్టీకి గుడ్ బై చెబుతున్నారంటూ ప్రచారం
  • స్వయంగా స్పందించిన నాదెండ్ల
  • ఇప్పటికే జనసేనను వీడిన రావెల

సార్వత్రిక ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన పార్టీల్లో జనసేన ఒకటి. ప్రభంజనం స్థాయిలో కాకపోయినా, పవన్ కల్యాణ్ గణనీయమైన స్థాయిలో ఏపీలో జనసేనకు సముచితస్థానం సాధించిపెడతాడని ఆశించినవారికి తీవ్ర నిరాశే మిగిలింది. పవన్ పోటీచేసిన రెండుస్థానాల్లో ఓటమిపాలవగా, రాపాక వరప్రసాద్ ఒక్కడు గెలిచి పార్టీ పరువు నిలిపాడు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ భవితవ్యంపై సందేహాలు ముసురుకున్నాయి.

రావెల కిశోర్ బాబు వంటి సీనియర్ నాయకుడు జనసేనకు గుడ్ బై చెప్పగా, ఇప్పుడదే బాటలో కీలకనేత నాదెండ్ల మనోహర్ కూడా వైదొలగుతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా అబద్ధం అంటూ ఓవైపు జనసేన ఖండించింది. మరోవైపు, నాదెండ్ల మనోహర్ కూడా తనవంతు స్పష్టత ఇచ్చారు. తాను జనసేన పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు. ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, అందుకే జనసేన పార్టీ  సమీక్షా సమావేశాలకు రాలేకపోతున్నానని వివరించారు.

More Telugu News