TTD: నేను వంద శాతం హిందువును...అవి గిట్టనివారు సృష్టించిన కట్టుకథలు: వై.వి.సుబ్బారెడ్డి వివరణ

  • తిరుమల శ్రీవారు మా ఇష్టదైవం
  • దేవుని సేవ చేసే అవకాశం రావడం అదృష్టం
  • అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు

తాను వందశాతం హిందువునని, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తమ ఇష్టదైవమని మాజీ ఎంపీ, టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఖరారైన వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన పేరును ఈ పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్‌ని అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని ఆయన విమర్శించారు.

అమరావతిలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీఎం జగన్‌ కు బాబాయి అయిన సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి ఇస్తున్నారనగానే ఆయన క్రిస్టియన్‌ అన్న వార్తలు వెల్లువెత్తాయి. ఓ హిందు ధార్మిక సంస్థ పదవిని క్రిస్టియన్‌కి ఎలా కేటాయిస్తారని, ఎవరినైనా హిందువును ఆ పదవిలో నియమించాలంటూ విమర్శలు పెరగడంతో సుబ్బారెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

 తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలు అక్కర్లేదన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని, దైవ సేవకు నన్ను పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానన్నారు. బాధ్యతలు చేపట్టాక ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ కచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు.

More Telugu News