TRS: జంప్ చేసే ఆ ఒక్కరూ ఎవరు?... సీఎల్పీ విలీనానికి పావులు కదుపుతున్న అధికార టీఆర్‌ఎస్‌

  • ఉత్తమ్‌ రాజీనామాతో సభలో  18కి తగ్గిన కాంగ్రెస్‌ బలం
  • మూడులో రెండొంతుల సభ్యులుంటే విలీనం సాధ్యం
  • ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరుతామన్న పదకొండుమంది

తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌లో చేరే ఆ ఒక్క కాంగ్రెస్‌ శాసన సభ్యుడు ఎవరు? ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అధికార పార్టీలో సీఎల్పీ విలీనానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌కు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో కొత్త జవసత్వాలు వచ్చినట్టయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్‌ బలం 18కి తగ్గింది.

సీఎల్పీ విలీనానికి మూడొంతుల్లో రెండొంతులు సభ్యుల మద్దతు అవసరం. అంటే 12 మంది సభ్యులు కావాలి. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి 11 మంది సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. వీరిలో సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు(పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు), హరిప్రియ(ఇల్లందు), వనమా వెంకటేశ్వర రావు(కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్‌), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్‌), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్‌), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి)లు ఉన్నారు.

అంటే 12 సంఖ్యకు మరొకరు కావాలి. ఇప్పుడు ఆ ఒక్కరూ ఎవరు? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ ఒక్కరూ వచ్చేస్తే విలీనం పూర్తయినట్టే. ఇక మిగిలిన ఏడుగురు సభ్యుల్లో ఒకరు టీఆర్ ఎస్ లో చేరితే ఆ పార్టీ బలం ఆరుకు పడిపోతుంది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగిలినట్టే!

More Telugu News