Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన ఎస్సై.. కొనప్రాణంతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు!

  • హోంగార్డుతో బాధితుడికి భూవివాదం
  • రంగంలోకి దిగిన ఎస్సై.. స్టేషన్ కు పిలిపించి చావబాదుడు
  • ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

భూవివాదం విషయంలో హోంగార్డుతో గొడవపడ్డ ఓ వ్యక్తిపై ఎస్సై తన ప్రతాపాన్ని చూపించాడు. లాఠీలతో విచక్షణారహితంగా చావబాదాడు. దీంతో సదరు బాధితుడు ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మార్కాపురంలో చెన్నకేశవులు అనే వ్యక్తికి, అక్కడే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హోంగార్డుకు మధ్య భూవివాదం ఉంది.

ఈ క్రమంలో నిన్న ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మార్కాపురం ఎస్సై ఆంజనేయులు చెన్నకేశవులను స్టేషన్ కు పిలిపించాడు. అనంతరం అతను చెప్పేది వినకుండా లాఠీతో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ దాడిలో చెన్నకేశవులు తీవ్రంగా గాయపడటంతో అతడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News