postcards: ‘జై శ్రీరామ్’ పేరుతో మమతకు 10 లక్షల పోస్టుకార్డులు.. బీజేపీ నిర్ణయం

  • టీఎంసీ నేతలు సమావేశమైన వేదిక వద్ద బీజేపీ కార్యకర్తల ‘జై శ్రీరాం’ నినాదాలు
  • లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
  • నిరసనగా 10 లక్షల ఉత్తరాలు పంపాలని నిర్ణయం

‘జై శ్రీరాం’ అని రాసి ఉన్న పది లక్షల పోస్టు కార్డులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన అర్జున్ సింగ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇటీవల టీఎంసీ నేతలు సమావేశమైన వేదిక వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరాం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తొలుత వారిని అక్కడి నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

దీనికి నిరసనగా ‘జై శ్రీరాం’ పేరుతో 10 లక్షల పోస్టు కార్డులను సీఎం మమతకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. కాగా, బీజేపీ తీరుపై టీఎంసీ నేత మల్లిక్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంటి కల్చర్‌ను చూడలేదని, ఇది బీజేపీ కల్చర్ అని మండిపడ్డారు.

More Telugu News