Love Jihad: హైదరాబాద్ లో లవ్ జిహాద్ కలకలం... తమ బిడ్డ మతాన్ని మార్పించారని పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు!

  • రిజ్వాన్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి
  • ఆపై మిమ్మల్ని చూడాలని ఉందంటూ తల్లిదండ్రులకు సమాచారం
  • ఆందోళనతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు

తమ బిడ్డను మాయమాటలతో మతం మార్పించిన ఓ ముస్లిం యువకుడు, ఆమెను సిరియాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇది ఐఎస్ఐ ఉగ్రవాదుల పనేనని ఓ యువతి తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడం కలకలాన్ని రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉండే యువతికి, కరీంనగర్ లో రిజ్వాన్ అనే యువకుడు బీటెక్ చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం రిజ్వాన్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారగా, గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని రహస్యంగా ఉంచిన యువతి, హాస్టల్ లోనే ఉంటూ, ఇటీవల తన తండ్రికి మెసేజ్ ద్వారా, తన పెళ్లి విషయాన్ని చెప్పింది.

ఆపై తాను మతం మార్చుకున్నానని, మిమ్మల్ని చూడాలని ఉందంటూ మెసేజ్ చేయడంతో, వారు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె వివాహం విషయం తమకు తెలియదని, రిజ్వాన్ మోసపూరితంగా తమ బిడ్డను సిరియాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు ఆరోపించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు, వారిద్దరూ మేజర్లని, సదరు యువతి ఇష్టపూర్వకంగానే రిజ్వాన్ ను వివాహం చేసుకుందని వెల్లడించారు. ఈ జంటతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నామని అన్నారు. కేసును లోతుగా దర్యాఫ్తు చేస్తున్నట్టు పంజాగుట్ట ఏసీపీ వెల్లడించారు. బలవంతంగా మతాన్ని మార్చారన్న ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరామని అన్నారు. 

More Telugu News