Jagan: అప్పుడే నిండిపోయిన గ్యాలరీలు... జగన్ కోసం వేచి చూస్తున్న వేలాది మంది!

  • మరో మూడు గంటల్లో జగన్ ప్రమాణ స్వీకారం
  • సాధారణ ప్రజలతో నిండిన గ్యాలరీలు
  • శివార్లలోనే వాహనాలను ఆపేస్తున్న పోలీసులు

ఈ ఉదయం 12.23కి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, 10 గంటల్లోపు వచ్చిన సాధారణ ప్రజలకు మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేసిన సంగతి విదితమే. దీంతో, ఉదయం 8.30 గంటలకే గ్యాలరీలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సాధ్యమైనంత త్వరగా వెళ్లాలని భావించిన సాధారణ అభిమానులతో విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది.

గత రాత్రి భారీ వర్షంతో ఎండ కాస్తంత తగ్గినట్టు కనిపిస్తుండటంతో, ప్రస్తుతం వాతావరణం కొంత ఆహ్లాదకరంగానే ఉందని ప్రజలు అంటున్నారు. ఇక వీఐపీలు, ఆహ్వానితులు కూర్చునే ప్రాంతంలో పెద్ద పెద్ద కూలర్లను అమర్చారు. వీఐపీలు ఇంకా ఎవరూ రానప్పటికీ, 11.30 గంటల ప్రాంతానికి స్టేడియం మొత్తం నిండిపోతుందని అధికారులు అంటున్నారు. 12 గంటల్లోపే జగన్ స్టేడియానికి చేరుకుంటారని చెబుతున్నారు. సాధారణ ప్రజలతో స్టేడియం ఇప్పటికే నిండిపోవడంతో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వైసీపీ అభిమానులను పోలీసులు విజయవాడ నలువైపులా ఉన్న శివార్లలోనే ఆపుతున్న పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News