Andhra Pradesh: తన ప్రమాణస్వీకారం పూర్తి కాగానే.. కేసీఆర్ తో కలసి ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న జగన్!
తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్న కేసీఆర్, జగన్ అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. విజయవాడలో ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
జగన్ ప్రమాణస్వీకారం జరిగిన వెంటనే వైసీపీ అధినేత జగన్, కేసీఆర్ తో కలిసి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారని సమాచారం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన సందర్భంగా విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను మరోసారి నెరవేర్చాలని ప్రధానిని ఇద్దరు ముఖ్యమంత్రులు కోరనున్నట్లు సమాచారం.