Andhra Pradesh: ‘సాధినేని యామిని లోకేశ్ కు చాలా క్లోజ్’ అన్న ఆరోపణలపై స్పందించిన యామిని!

  • నాతో పాటు షర్మిల, ప్రియాంకలపై తప్పుడు ప్రచారం
  • పనీపాటా లేనివాళ్లే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ నేత

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, వైఎస్ జగన్ సోదరి షర్మిల, బ్రాహ్మణితో పాటు తన గురించి కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారనీ, విమర్శలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. ఇలాంటి విమర్శలు చేసేవారికి జవాబు ఇచ్చి తన విజ్ఞతను తగ్గించుకోనని స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధినేని యామిని పలు అంశాలపై ముచ్చటించారు.

ఈ సందర్భంగా ‘టీడీపీలోకి యామిని వచ్చాక నారా లోకేశ్-బ్రాహ్మణి దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. సాధినేని యామిని లోకేశ్ బాబుతో చాలా క్లోజ్ గా ఉన్నారు’ అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో పనీపాటా లేనివాళ్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని యామిని స్పష్టం చేశారు. ‘నాకయితే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాకు పిల్లల భవిష్యత్, దాతృత్వం, పిల్లల బాధ్యత, వ్యాపారంతో పాటు కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి. నేను వీటిలో తలమునకలు అయ్యాను కాబట్టి ఈ ఆరోపణలను పట్టించుకోను.

నా గురించి ఏం తెలుసని వీళ్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు? అవతల లేడీ కాబట్టి ఆమెపై బురద చల్లేసి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా ఆనందం వస్తుందని భావించే నెటిజన్లను నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ల ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మంచి ఉంటుంది. చెడు కూడా ఉంటుంది. మెచ్చుకునేవారు ఉంటారు. ఇలా బురద చల్లేవారూ ఉంటారు. అన్నింటిని నేర్చుకుంటున్నాను.

చంద్రబాబు ఇంటిలోపలకు యామిని బెంజ్ కారు వెళుతుందన్నది నిజం కాదు. నా కారు ఇప్పటివరకూ ప్రజావేదిక లోపలకు వెళ్లలేదు. ఇక లోకేశ్ అంటారా.. నా సోదరుడితో సమానం. మంచి కుటుంబం, ప్రేమించే భర్త, ఎదిగివచ్చిన పిల్లలు ఉన్నప్పుడు ఎవ్వరూ అలాంటి పనులు చేయరు. నాపై వస్తున్న విమర్శలను చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని సాధినేని యామిని స్పష్టం చేశారు.

More Telugu News