Jagan: జగన్ కు స్వీట్ తినిపించిన కేసీఆర్... 'లోపలికి రామ్మా' అంటూ వైఎస్ భారతికి ఆత్మీయ స్వాగతం!

  • నివాసంలోంచి వెలుపలికి వచ్చి జగన్ కు స్వాగతం
  • పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ ఆలింగనం
  • ప్రమాణస్వీకారానికి రావాలంటూ కేసీఆర్ కు జగన్ ఆహ్వానం

హైదరాబాద్ వచ్చిన ఏపీ కాబోయే సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన జగన్ ఆపై సతీసమేతంగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ రాక విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన నివాసంలోంచి వెలుపలికి వచ్చి జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జగన్ దంపతులను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, "లోపలికి రామ్మా" అంటూ వైఎస్ భారతిని ఆహ్వానించారు. ఇంతలో కేసీఆర్ అర్ధాంగి కూడా వచ్చారు. ఆమె సైతం జగన్ ను అభినందించారు.
 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు జగన్ ను మనస్ఫూర్తిగా అభినందించిన కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ఎంతో ఆప్యాయంగా జగన్ కు స్వీట్ తినిపించారు. అక్కడే ఉన్న తెలంగాణ స్పీకర్, ఇతర మంత్రులను జగన్ కు పేరుపేరునా పరిచయం చేశారు. మాటామంతీ సందర్భంగా, జగన్ తాను ఈ నెల 30న విజయవాడలో ప్రమాణస్వీకారం చేస్తున్నానని, తప్పక రావాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. జగన్ ఆహ్వానానికి తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

More Telugu News