Telugudesam: టీడీపీ పరువు కాపాడింది ఆ మూడు జిల్లాలే...అక్కడే సగం సీట్లు

  • అత్యధికంగా విశాఖ నగరం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో
  • మూడు చోట్ల నాలుగేసి స్థానాల్లో గెలుపు
  • మిగిలిన చోట్ల రెండు లేదా ఒక స్థానానికే పరిమితం

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ  కేవలం 23 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 12 స్థానాలు విశాఖ నగరం, తూర్పు, ప్రకాశం జిల్లాల్లోనే రావడం గమనార్హం. విశాఖ నగరంలో నాలుగు స్థానాలు దక్కించుకున్న టీడీపీ మిగిలిన రెండు జిల్లాల్లో చెరో నాలుగు స్థానాలు సొంతం చేసుకుంది.

ఇక విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లోను, మూడు పార్లమెంటరీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓటమిపాలై గట్టి దెబ్బతిన్నా నగరం నడిబొడ్డున ఉన్న ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ నియోజకవర్గాల ఓటర్లు మాత్రం పసుపు జెండా పట్ల తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ స్థానాలు, పెద్దాపురం, మండపేట స్థానాలను గెల్చుకుంది. ఇక ప్రకాశం జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, కొండెపి స్థానాల్లో సైకిల్‌ హవా సాగింది.

మిగిలిన 11 స్థానాల్లో గుంటూరు పశ్చిమ, రేపల్లె, కృష్ణా జిల్లాలో విజయవాడ తూర్పు, గన్నవరం, పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, ఇచ్చాపురం, అనంతపురం జల్లాలో హిందూపురం, ఉరవకొండ, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని కుప్పం స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కాయి. గెలిచిన సీట్ల సరళిని బట్టి చూస్తే ఎక్కువ స్థానాలు నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండడం గమనార్హం.

More Telugu News