Telugudesam: టీడీపీ హేమాహేమీల వారసులను తిరస్కరించిన ఏపీ ప్రజలు!

  • కేంద్ర మంత్రుల వారసుల నుంచి ముఖ్యమంత్రి బిడ్డ వరకూ
  • ఓడిపోయిన చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, జేసీ, పరిటాల వారసులు
  • సీనియర్ నేతల వారసులకు ఓట్లు వేయని ప్రజలు

వారంతా తెలుగుదేశం పార్టీలో తలపండిన నేతలు. రాష్ట మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా సేవలందించినవారే. వారి వారసులను తాజా ఎన్నికల రణక్షేత్రంలో నిలుపగా, ప్రజలు వారిని తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హేమాహేమీల బిడ్డలు, బంధువులు ఓటమి పాలయ్యారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది నారా లోకేశ్ గురించే. ముఖ్యమంత్రి బిడ్డగా, తెలుగుదేశం పార్టీకి కాబోయే నేతగా ఆ పార్టీ నేతలు చెప్పుకున్న లోకేశ్, అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుంచి పోటీ పడ్డ ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. పలాస నుంచి పోటీ పడిన గౌతు లచ్చన్న కుమార్తె గౌతు శిరీష, విజయనగరం నుంచి బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, అరకు నుంచి పోటీ చేసిన దివంగత కిడారి కుమారుడు కిడారి శ్రావణ్ లున్నారు.

వీరితో పాటు కాగిత కృష్ణప్రసాద్ (పెడన), షబానా ఖాతూన్ (విజయవాడ పశ్చిమ), దేవినేని అవినాశ్ (గుడివాడ), బొజ్జల సుధీర్ (శ్రీకాళహస్తి), గాలి భానుప్రకాశ్ (నగరి), పరిటాల శ్రీరామ్ (రాప్తాడు), జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి), టీజీ భరత్ (కర్నూలు), కేఈ శ్యామ్ (పత్తికొండ) తదితరులున్నారు. ఇక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారసుల జాబితాలో బాలకృష్ణ అల్లుడు ఎం భరత్ (విశాఖ), మాగంటి రూప (రాజమండ్రి), జేసీ పవన్ రెడ్డి (అనంతపురం) తదితరులున్నారు.

More Telugu News