Andhra Pradesh: కొత్త సీఎంకు ప్రాధాన్యత అంశాలు తెలియజేస్తాం: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • వివరాలు అందించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ఆదేశాలు
  • ఈ నెల 30న జగన్ ప్రమాణస్వీకారం
  • ఎల్లుండి వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

ఏపీలో కొత్త సీఎం జగన్ అని తేలిపోయింది! ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ లో ఏమాత్రం అవకాశాలు లేని స్థితికి అధికార టీడీపీ దిగజారిపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని అధికార వర్గాలు కూడా నిర్ధారించుకున్నాయి. ఈ క్రమంలో కొత్త సీఎం పదవిలోకి వస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రాధాన్యత అంశాలను తనకు నివేదించాల్సిందిగా అధికారులను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఈ వివరాలను నూతన ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎస్ తెలిపారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు స్పష్టమైన ఉత్తర్వులు అందాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జగన్ ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఎల్లుండి జగన్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి, ఆపై కొత్త మంత్రివర్గంపై కసరత్తులు ప్రారంభిస్తారని సమాచారం!

More Telugu News