bank loan: అప్పు తీర్చలేదని కేసు పెట్టిన బ్యాంకు అధికారులు.. మనస్తాపంతో కలెక్టరేట్ ముందు ఉరివేసుకున్న రైతు!

  • రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ లో ఘటన
  • బ్యాంకు నుంచి రూ.6.5 లక్షలు తీసుకున్న రైతన్న
  • రెండేళ్లలోపు కట్టలేకపోవడంతో అరెస్ట్

బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి పంట వేశాడు. కానీ ప్రకృతి కరుణించకపోవడంతో పంట చేతికి రాలేదు. బ్యాంకు అధికారులు కేసు పెట్టడంతో పోలీసులు ఆయన్ను స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో తీవ్రమనస్తాపానికి లోనైన సదరు రైతు కలెక్టర్ ఆఫీసు ముందే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ లో సోమవారం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హనుమాన్ గఢ్ కు చెందిన సురజరామ్(52) ఇక్కడి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి 6.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా, ఆయన్ను అరెస్ట్ చేశారు.

దీంతో సురజరామ్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన ఆయన సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News