Uttar Pradesh: ఘరానా దొంగలు...పోలీస్‌ స్టేషన్‌ స్టోర్‌ రూంలోనే చోరీ

  • విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన వైనం
  • ఒక రోజు తర్వాత గుర్తించిన సిబ్బంది
  • ఇద్దరు మహిళలు అరెస్టు... మరో ఇద్దరు పరారు

అక్కడా ఇక్కడా చోరీ చేయడం ఎందుకనుకున్నారో ఏమో...ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే కన్నం వేశారు. స్టేషన్‌ను ఆనుకుని ఉన్న స్టోర్‌ రూంలో విలువైన వస్తువులను అపహరించారు. చోరీ జరిగిన విషయాన్ని ఓ రోజైతేగాని పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు.

 ఈ స్టేషన్‌ పరిధిలో స్టోర్‌ రూం ఉంది. వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర విలువైన వస్తువులను ఈ స్టోర్‌ రూంలో భద్రపరుస్తుంటారు. మే 18వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టోర్‌ రూంలోకి చొరబడి 90 బ్యాటరీలు, రెండు గ్యాస్‌ సిలెండర్లు, సీసీ టీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలు ఎత్తుకెళ్లారు.

20వ తేదీ ఉదయం వరకు ఈ చోరీని ఎవరూ గమనించ లేదు. ఆ రోజు ఉదయం స్టోర్‌ ఇన్‌చార్జి గది వద్దకు వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన దుండగులు మొత్తం నలుగురు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News