Andhra Pradesh: టీడీపీ గెలుస్తుందని లగడపాటి సర్వేనే కాదు.. ఇంకా చెప్పాయి!: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • లగడపాటికి, మాకు ఎటువంటి సంబంధం లేదు
  • ఆ విషయం నిన్న లగడపాటి కూడా చెప్పారు
  • నేషనల్ మీడియా మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పింది

ఏపీలో టీడీపీ గెలుస్తుందని కేవలం లగడపాటి సర్వే మాత్రమే చెప్పలేదని, ఇంకా చాలా సర్వేలు చెప్పాయని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లగడపాటికి, తమకు ఎటువంటి సంబంధం లేదని, ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పారని అన్నారు. ‘నేను అందరివాడిని’ అని నిన్న లగడపాటి చెప్పారని గుర్తుచేశారు. ఏపీలో టీడీపీ గెలుస్తుందని సీ-ఓటర్, టుడేస్ చాణక్య తదితర సర్వే సంస్థలు కూడా చెప్పాయని అన్నారు.

నేషనల్ మీడియా మాత్రం తాము గెలవట్లేదని వైసీపీ గెలుస్తోందని చెప్పాయని తెలిపారు. నేషనల్ ఛానెల్స్ ఏపీలో ఎలా సర్వే చేస్తాయి? కేవలం ఏపీలో సర్వే చేయాలంటేనే మూడు నాలుగు కోట్లు ఖర్చవుతుందని, అన్ని రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే ఆయా ఛానెల్స్ చేస్తాయా? అని ప్రశ్నించారు. జాతీయ మీడియా ఛానెల్స్ వాళ్లు ఏపీలో సర్వే చేయాలంటే ఇక్కడి భాష తెలియాల్సిన అవసరం లేదా? ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే మోదీ, అమిత్ షాలు చెప్పినట్టుగా జరిగిన సర్వే అని విమర్శించారు.

More Telugu News