Narendra Modi: కేదార్ నాథ్ లో మోదీ ధ్యానం.. వెటకారంగా స్పందించిన బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా!

  • వెడ్డింగ్ ఫొటోగ్రఫి తర్వాత ఇదే పాప్యులర్ అయిందని వ్యాఖ్య
  • తాను వర్క్ షాపు మొదలుపెడుతున్నట్లు ప్రకటన
  • కాషాయ రంగు కుక్క బొమ్మతో దిగిన ఫొటో పోస్ట్

ప్రధాని మోదీ ఇటీవల కేదార్ నాథ్ పుణ్యక్షేత్రంలోని ఓ గుహలో 20 గంటల పాటు ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కళ్లద్దాలు పెట్టుకునే ధ్యానంలో కూర్చోవడం, మోదీ టూర్ కు సంబంధించి చాలా ఫొటోలు బయటకు రావడంపై బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా సెటైరికల్ గా స్పందించారు. ‘‘ప్రజలారా అందరూ సిద్ధం కండి. ఇటీవల సోషల్ మీడియాలో పలు ఆధ్యాత్మిక చిత్రాలు(ఫొటోలు) చూశాక నేను ఓ వర్క్ షాప్ నిర్వహిస్తున్నా. దాని పేరు ‘మెడిటేషన్ ఫొటోగ్రఫి-ఫోజెస్ అండ్ యాంగిల్స్’.

చూస్తుంటే వెడ్డింగ్ ఫొటోగ్రఫి తర్వాత ఇదే బాగా పాప్యులర్ అవుతుందని నాకు అనిపిస్తోంది’’ అని ట్వింకిల్ చురకలు అంటించారు. ఈ సందర్భంగా కాషాయ రంగులో ఉన్న ఓ కుక్క పిల్ల బొమ్మ ముందు దిగిన ఫొటోను ట్వింకిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేయగా, అక్షయ్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.

More Telugu News