Andhra Pradesh: శభాష్.. అంటూ పులివర్తి నానిని ప్రశంసించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు!

  • ఏపీ సీఎంతో చంద్రగిరి అభ్యర్థి సమావేశం
  • పోలింగ్ టీడీపీకే అనుకూలంగా జరిగిందని వివరణ
  • ఏప్రిల్ 11 కంటే ఎక్కువ పోలింగ్ నమోదయిందని వ్యాఖ్య

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. నిన్న చంద్రగిరిలో ఏడు కేంద్రాల్లో జరిగిన రీపోలింగ్ టీడీపీకే అనుకూలంగా ఉందని నాని అధినేతకు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఏప్రిల్ 11 నాటి కంటే ఎక్కువ పోలింగ్ నమోదయిందని చెప్పారు. ఈసారి చంద్రగిరిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నానిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

ఎన్నార్ఎ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఇటీవల ఈసీ ఆదేశించింది. ఈ గ్రామాల్లో దళితులను ఓట్లేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు గ్రామాలతో పాటు కాలేపల్లి, కుప్పం బాదూరులో కూడా రీపోలింగ్ నిర్వహించాలన్న టీడీపీ నేతల డిమాండ్ కు ఈసీ అంగీకరించింది. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో నిన్న ఎన్నికలను సజావుగా నిర్వహించింది.

More Telugu News