కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం: సీఎం కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన కేసీఆర్
- ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా ప్రజలు తరలివస్తారు
- ఆలయ అభివృద్ధికి 600 ఎకరాల భూసేకరణ చేయాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం మేడిగడ్డలో అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత దృష్ట్యా ఈ ప్రాంతానికి ప్రజలు లక్షల సంఖ్యలో తరలివస్తారని, దానికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల భూసేకరణ చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. కాళేశ్వరంను గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్ స్థలాలను అక్వైర్ చేయాలని, కల్యాణ మండపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పేందుకు వీలుగా ఆలయ నిర్మాణాన్ని విస్తరించాలని ఆదేశించారు.