Pawan Kalyan: 'మై హోమ్' చైర్మన్ జూపల్లి సోదరుడి కుమార్తె పెళ్లికి విచ్చేసిన పవన్ కల్యాణ్

  • సాదరంగా ఆహ్వానించిన జూపల్లి
  • పవన్ ను వధూవరులకు పరిచయం చేసిన 'మై హోమ్' అధినేత
  • ఆశీస్సులు అందించిన జనసేనాని

మై హోమ్ గ్రూప్ చైర్మన్, టీవీ9 గ్రూప్ చానళ్ల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు సోదరుడు జగపతిరావు కుమార్తె శ్రీలక్ష్మి వివాహం ఇవాళ హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. జస్టిస్ పోనుగంటి నవీన్ రావు కుమారుడు నృపుల్ రావుతో శ్రీలక్ష్మి వివాహానికి రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

అంతకుముందు పవన్ వివాహ వేదిక వద్దకు వస్తుండగా జూపల్లి రామేశ్వర్ రావు స్వయంగా ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పవన్ చెవిలో ఏదో చెప్పడం కనిపించింది. అందుకు పవన్ చిరునవ్వులు చిందించారు. ఇరువురు కాసేపు ముచ్చటించుకోవడమే కాదు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వధూవరులకు పవన్ ను పరిచయం చేసిన జూపల్లి ఆ తర్వాత కూడా జనసేనానితో దీర్ఘమంతనాలు సాగించారు. జూపల్లి చెప్పే విషయాలను పవన్ ఎంతో ఆసక్తిగా విన్నారు. కాగా, ఈ వివాహ మహోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు అనేక రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లి త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగింది.

More Telugu News