Telangana: చరిత్ర సృష్టించనున్న తెలంగాణ హైకోర్టు... కాళేశ్వరంపై నేడు ఒకేసారి 177 పిటిషన్ల విచారణ!

  • పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేబట్టవద్దంటూ పిటిషన్లు  
  • సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
  • అన్నింటిపైనా నేడు విచారణ

నేడు తెలంగాణ హైకోర్టు చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు అందగా, వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించింది. కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది.

రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది.

More Telugu News