Andhra Pradesh: చంద్రబాబును ‘పసుపు-కుంకుమ’ కాపాడుతున్నప్పుడు వీళ్లందరిని ఎందుకు పట్టించుకోవడం?: కోన వెంకట్

  • నీ జనాలు నీ వెంటే వున్నప్పుడు భయమెందుకు? 
  • ప్రజలు బలమైన ఉద్యమంలా వచ్చి టీడీపీకి ఓట్లేశారట
  • అలాంటప్పుడు వీళ్లందరికీ భయపడటమెందుకు?

టాలీవుడ్ కు చెందిన వారిని సీఎం కేసీఆర్ బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడించారని, వైసీపీకి వారిని మద్దతు తెలపాలని భయపెట్టారని అంటూ వచ్చిన ఆరోపణలపై ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ స్పందించారు. చంద్రబాబు వెంటే జనాలు ఉంటే కనుక ఇంకా ఆయన భయపడడమెందుకు? అని కోన వెంకట్ ప్రశ్నించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నీ జనాలు నీ (చంద్రబాబు) వెంటే ఉన్నప్పుడు, ‘పసుపు-కుంకుమ’ కాపాడుతున్నప్పుడు, బలమైన ఉద్యమంలా వచ్చి ఓట్లేసినప్పుడు వీళ్లందరిని అసలు ఎందుకు పట్టించుకోవాలి?’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంటే అది ‘ప్రత్యేక హోదా’నే అని, కేసీఆర్, కేటీఆర్ ను అక్కడి ప్రజలు మర్చిపోయారని, కేసీఆర్ ను విలన్ గా ఏపీ ప్రజలు ఏమాత్రం చూడట్లేదని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్ లకు చంద్రబాబు రూపంలో ఓ విలన్ దొరికాడు

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాకూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేసిన విషయాన్ని ప్రశ్నించగా కోన వెంకట్ స్పందిస్తూ, చంద్రబాబు రాకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొన్ని ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని అన్నారు. ఎందుకంటే, ఒకడు హీరో కావాలంటే, వాడికి ఓ విలన్ కావాలని, ఆ విలన్ ఉన్నప్పుడే హీరోయిజం బయటపడుతుందని అన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు చంద్రబాబు రూపంలో ఓ విలన్ దొరికాడని, దీంతో, హీరో ఎలివేట్ అయ్యాడని అన్నారు.  

More Telugu News