Mansoon: ఈసారి కాస్త ఆలస్యంగా కేరళను తాకనున్న రుతుపవనాలు!

  • జూన్ 6న కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా
  • ఐదు రోజులు ఆలస్యంగా భారత్ లో ప్రవేశించే అవకాశం
  • జూలై రెండో వారానికి దేశమంతా వ్యాప్తి

సాధారణంగా జూన్ 1 నుంచి భారత్ లో నైరుతి రుతుపవనాల సీజన్ గా భావిస్తారు. భారత్ లో అత్యధిక వర్షపాతాన్నిచ్చే ఈ నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నాయి. జూన్ 6న కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఐదు రోజులు ఆలస్యంగా భారత్ లో ప్రవేశించే ఈ నైరుతి రుతుపవనాలు జూలై రెండోవారంలో దేశమంతా విస్తరిస్తాయని పేర్కొంది.

నైరుతి రుతుపవనాల కదలిక మే 18-19న అండమాన్ నికోబార్ దీవుల వద్ద మొదలవుతుందని, ఆపై జూన్ మొదటి వారంలో భారత్ ప్రధాన భూభాగంపై రుతుపవనాల ప్రభావం ఉంటుందని ఐఎండీ అధికారులు వివరించారు. కాగా, ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ నైరుతి రుతుపవనాల సీజన్ లో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

More Telugu News