paruchuri: జీవిత కారణంగానే నా భుజంపైకి ఎర్రశాలువా వచ్చింది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ప్రజాస్వామ్యం'లో జీవిత నటించింది
  •  విపరీతమైన చలిలో షూటింగు చేశాము
  •  నాకు జీవిత ఒక శాలువా ఇచ్చింది  

ఎన్నో చిత్రాలకి రచయితగా పనిచేసి ప్రేక్షకులను మెప్పించిన పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాంటి గోపాలకృష్ణ, తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'జీవిత' గురించి మాట్లాడారు. "తొలిసారిగా నేను 'రేపటి స్వరాజ్యం' సినిమా కోసం దర్శకుడిగా మారాను. ఈ సినిమాలో జీవిత ఒక మంచి పాత్రను పోషించింది. ఆమెలో శారదగారి వంటి మంచి నటి ఉందని అప్పట్లోనే నేను గుర్తించాను.

ఆ తరువాత నేను చేసిన  'ప్రజాస్వామ్యం' సినిమాలోను జీవిత నటించింది. విపరీతమైన చలిలో తెల్లవారు జామున 4 గంటలకు ఈ సినిమా షూటింగు చేస్తున్నాను. చలికి నేను బాధపడుతుండటం చూసి, తన ఎర్ర శాలువాను జీవిత నాకు ఇచ్చింది. 1987 డిసెంబర్ 11న ఈ సినిమా సక్సెస్ టూర్ కి మేమంతా వెళ్లాము. 'ప్రజాస్వామ్యం'లో నేను ఒక కమ్యూనిస్ట్ పాత్రను చేశాను గనుక, జీవిత ఇచ్చిన శాలువాను భుజాన వేసుకుని సక్సెస్ టూర్లో పాల్గొన్నాను. దాంతో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా జీవిత మూలంగా నా భుజం పైకి ఎర్ర శాలువా వచ్చింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News