Mahesh Bhagawat: రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పై ప్రశంసలు కురిపించిన ఐపీఎల్ నిర్వాహకులు!

  • విజయవంతంగా ముగిసిన ఐపీఎల్-12 సీజన్
  • హైదరాబాద్ లో పోలీసుల ఏర్పాట్లు భేష్
  • కృతజ్ఞతలు తెలిపిన నిర్వాహకులు

తాను చేపట్టిన ఎటువంటి కేసునైనా సమర్థవంతంగా తేల్చుతారన్న పేరున్న రాచకొండ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్, తన ముందుకు వచ్చిన మరో టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసి అభినందనలు అందుకున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ -12 ఫైనల్ జరుగగా, ఈ మ్యాచ్ లో భద్రతా ఏర్పాట్లపై ఐపీఎల్ నిర్వాహకులు మహేశ్ భగవత్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రశంసలు వర్షం కురిపించారు.

రాచకొండ పోలీసుల బందోబస్తు ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. మార్చి 29 నుంచి ఆదివారం వరకూ మొత్తం 8 మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరుగగా, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారని కృతజ్ఞతలు తెలిపారు. కాగా పోటీల నిర్వహణ నిమిత్తం స్టేడియం ఆవరణలో 300కు పైగా సీసీ కెమెరాలు అమర్చగా, తాత్కాలిక నిఘా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. బ్లాక్ టికెట్లపై నిఘాను పెంచి, 93 మందిని అరెస్ట్ చేశారు.

More Telugu News